హైదరాబాద్: ఆమ్ ఆద్మీ ఓ కొత్త చరిత్ర సృష్టించింది. అభివృద్ధి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. వాస్తవానికి పంజాబీ ఓటర్లు చాలా సైలెంట్ దెబ్బ తీశారు. కాంగ్రెస్ను తమదైన స్టయిల్లోనే ఖంగుతినిపించారు. మంచి విద్య, ఆరోగ్యం, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీకే పట్టం కట్టారు. కేజ్రీవాల్ ఇప్పుడో నేషనల్ హీరో అయ్యారు. కులం, మతం, డేరాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీలను పంజాబీ ఓటర్లు పక్కనపెట్టేశారు. తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ అసాధారణ విజయం సాధించింది. ఇది జాతీయ స్థాయిలో పెను ప్రభావాన్ని చూపనున్నది.
జాతీయ పార్టీ హోదాలో బీజేపీకి ఇప్పుడు ఆమ్ ఆద్మీ ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం, దళితులు, రైతుల అంశంపై పంజాబ్లో చాలా రాజకీయమే సాగింది. కానీ ఏ ఒక్క అంశం కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసిరాలేదు. గురు రవిదాస్ భజనల్లో సీఎం చన్నీ, ప్రధాని మోదీ పాల్గొన్నా.. ఆ ఎత్తు వాళ్లకు ప్లస్ కాలేకపోయింది. సిద్దూ పెట్టిన చిచ్చుతో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రం నుంచి వెలివేతకు గురైంది. కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడిగా సిద్ధూ రాణించలేకపోయారు. సీఎం చన్నీతో పాటు అమరీందర్ భవిష్యత్తును ఆయన ముంచేశారు. సాంప్రదాయ పార్టీలకు పంజాబీలు తమ ఓటు పవర్తో చెక్ పెట్టేశారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ తాజా రిపోర్ట్ ప్రకారం.. 90 స్థానాల్లో ఆమ్ ఆద్మీ లీడింగ్లో కొనసాగుతోంది.