బెంగళూరు: కన్నడ తెలియదన్న పంజాబీ మహిళను అసభ్యకరంగా తిట్టడంతోపాటు పైపులతో దాడి చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్లోని లుధియానాకు చెందిన 40 ఏళ్లు పైబడిన మహిళ, కర్ణాటక రాజధాని బెంగళూరులో సెలూన్ అండ్ స్పా నిర్వహిస్తున్నది. శుక్రవారం రాత్రి 10 గంటలకు షాపు మూసిన తర్వాత ద్విచక్ర వాహనంపై విద్యారణ్యపుర ప్రాంతంలో వెళ్తున్నది. ఇంతలో ఒక చిన్నారి అజాగ్రత్తగా రోడ్డు దాటగా ఆమె సడన్గా తన స్కూటీని ఆపింది. ఈ నేపథ్యంలో పిల్లలను రోడ్డుపై అలా వదిలేయవద్దని అక్కడున్న తల్లిదండ్రులకు చెప్పింది.
కాగా, కొందరు స్థానిక మహిళలు ఆమె వద్దకు రాగా వాగ్వాదం మొదలైంది. పంజాబ్కు చెందిన ఆ మహిళలో కన్నడలో మాట్లాడకపోవడంపై గుంపులోని మహిళలు ఆమెను తిట్టారు. కర్ణాటక నుంచి వెళ్లిపోవాలని ఆమెతో అన్నారు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ తన మొబైల్ ఫోన్తో వారిని వీడియో తీయసాగింది. దీనిపై మండిపడిన మహిళలు ఆమె జట్టుపట్టుకుని లాగారు. ఆపై ప్లాస్టిక్ పైప్లతో కొట్టారు.
మరోవైపు తనపై జరిగిన దాడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ పంజాబీ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.