చండీగఢ్: డబ్బుల విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన మహిళ తన కుమారుడ్ని కాలువలో పడేసింది. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. రీనా కుమారి, రవి కుమార్ దంపతులకు 2012లో పెళ్లైంది. వారికి పదేళ్ల కుమార్తె, ఏనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబంలో ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తలు తరచుగా గొడవపడేవారు. ఈ నేపథ్యంలో భర్త రవి పని నిమిత్తం మాల్దీవులకు వెళ్లాడు.
కాగా, క్రిస్మస్ రోజున రాత్రి వేళ డబ్బుల విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో తన పిల్లల్ని నదిలో పడేస్తానని భార్య రీనా బెదిరించింది. మరునాడు కొడుకు అభిని తన వెంట తీసుకొని వెళ్లింది. లామినా గ్రామంలోని ఉచి బస్సీ కాలువ ఒడ్డున కుమారుడితోపాటు ఉంది. స్థానికుల నుంచి ఈ విషయం తెలుసుకున్న రవి సోదరుడు, తన తండ్రిని వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లాడు.
మరోవైపు వారిని చూసిన రీనా కుమారి వెంటనే కుమారుడు అభిని కాలువలో పడేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రీనా కుమారిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. బాలుడు అభి మృతదేహం కోసం ఆ కాలువలో గాలిస్తున్నారు.