చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఒక రిసార్ట్లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్కూళ్ల ప్రిన్సిపల్స్, టీచర్లను ఏసీ బస్సుల్లో తరలించారు. పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వారి సూచనలు, సలహాలు సీఎం భగవంత్ మాన్ కోరారు. ప్రస్తుత ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడ అమలు చేస్తున్న నమూనా విద్యను పంజాబ్లో అమలు చేస్తామని భగవంత్ మాన్ తెలిపారు. అలాగే విద్యా సంస్కరణలకు ఉపాధ్యాయుల నుంచి సూచనలు సలహాల కోసం ఒక ఆన్లైన్ పోర్టల్ను కూడా ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు టీచర్లు సలహాలు ఇవ్వాలని కోరారు.
కాగా, సీఎం భగవంత్ మాన్తో సమావేశం అనంతరం దీనికి హాజరైన వారికి ఆ రిసార్ట్లో ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. దీంతో భోజనం ప్లేట్ల కోసం ప్రభుత్వ స్కూళ్ల ప్రిన్సిపల్స్, టీచర్లు ఎగబడ్డారు. ఆ రిసార్ట్కు చెందిన ఒక సిబ్బంది వరుసగా ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే అన్ని వైపుల నుంచి వచ్చిన కొందరు అందినకాడికి భోజనం ప్లేట్లను లాక్కుపోయారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడ్డారు. విద్యార్థులకు వేసే శిక్షలను వీరికి విధించాలని కొందరు డిమాండ్ చేశారు. వారికి సివిక్ సెన్స్ నేర్చించాల్సి ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే సమావేశం చాలా సేపు జరిగి ఉంటుందని, దీంతో బాగా ఆకలి మీదన్న ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తించి ఉంటారని మరొకరు అభిప్రాయపడ్డారు.
Lunch time of Principals and Teachers in Punjab after meeting CM. Time to go to HEYWARD. CM might have gone home with some HEYWARDS. pic.twitter.com/bDwF1HooCm
— Abhijit Guha (@Abhijit33886372) May 11, 2022