Punjab Rocket Attack | పంజాబ్లోని మొహాలీలో గల రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఆఫీసులో పేలుడు ఘటన వెనుక ఉగ్రదాడి కోణం ఉందా? అంటే రాష్ట్ర పోలీసు శాఖ అవుననే చెబుతున్నది. రాకెట్ ప్రొఫెల్డ్ గ్రనెడ్ (ఆర్పీజీ) దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదికి అత్యంత సన్నిహితుడని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా శుక్రవారం మీడియాకు చెప్పారు. సోమవారం సాయంత్రం మొహాలీ ఇంటెలిజెన్స్ ఆఫీసుపై దాడి ఘటనలో కీలక సూత్రధాని లఖ్బిర్ సింగ్ లాండా. ఆయన తరణ్తరణ్ వాసి. గ్యాంగ్స్టర్ అయిన లఖ్బిర్సింగ్ 2017లో కెనడాకు షిఫ్ట్ అయ్యాడు. అతడు పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాది హరిందర్ సింగ్ రిండాకు అత్యంత సన్నిహితుడు అని అన్నారు.
ఈ దాడి వెనుక కుట్రదారులను గుర్తించామని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా తెలిపారు. దాడిలో ముగ్గురు పాల్గొన్నారన్నారు. అయితే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయలేదన్నారు. ఈ ఘటనలో ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేశామని అన్నారు.
సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో మొహాలీలోని సెక్టార్77లోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ఆఫీసుపై గ్రనేడ్ దాడి జరిగింది. దీంతో పంజాబ్ అంతటా అలర్ట్ ప్రకటించారు. ఆఫీసర్లంతా కార్యాలయాలను వీడిన తర్వాత బాంబు దాడి జరిగిందని వీకే భావ్రా తెలిపారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) అనే ఉగ్రవాద సంస్థ, పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మద్దతుతో గ్యాంగ్ స్టర్ లఖ్బీర్సింగ్ ఈ దాడికి కుట్ర పన్నాడని చెప్పారు.