Punjab PCC Siddu | వివాదాస్పద ప్రకటనలకు మారుపేరుగా ఉన్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం గమనార్హం. గత 34 నెలల్లో తమ రాష్ట్రం రూ.4000 కోట్లు నష్టపోయిందని, 15 వేల ఉద్యోగాలు కోల్పోయిందని శనివారం అమృత్సర్లో మీడియాతో చెప్పారు. పాకిస్థాన్తో వాణిజ్య లావాదేవీలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్రమోదీని సిద్దూ కోరారు.
వాణిజ్య లావాదేవీల పునరుద్ధరణతో అందరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. పాక్తో వాణిజ్య లావాదేవీలను పునరుద్ధరించాలని గతంలోనూ ప్రధాని మోదీని కోరానన్నారు. దశాబ్ద కాలం తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని సాగనంపి, కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలుచుకున్నది. 117 స్థానాలు గల పంజాబ్ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 20 స్థానాలు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ 15, బీజేపీ మూడు స్థానాలకు పరిమితం అయ్యాయి.