చండీఘడ్: పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ బెయిన్స్(Harjot Bains).. ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్(Jyothi Yadav)ను పెళ్లాడారు. రూపానగర్లో ఉన్న గురుద్వారాలో ఇవాళ వివాహ వేడుక జరిగింది. సిక్కు మత(Sikh religion) సంప్రదాయాల ప్రకారం ఆప్ ఎమ్మెల్యే హర్జోత్ పెళ్లి జరిగింది. నాన్గల్ వద్ద ఉన్న బిబోర్ సాహిద్ గురుద్వారా(Gurudwara)లో మ్యారేజ్ సెర్మనీ నిర్వహించారు. ఈ జంటకు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగింది.
రూపానగర్(Rupanagar) జిల్లాలోని ఆనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి బెయిన్స్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. ప్రస్తుతం భగవంత్మాన్ సింగ్(Bhagwant Mann) ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 32 ఏళ్ల హర్జోత్ బెయిన్స్ వృత్తి రీత్యా అడ్వకేట్. ఆనంద్పూర్ సాహిబ్లోని గంభీర్పూర్ ఆయన స్వగ్రామం. 2017 ఎన్నికల్లో ఆయన సాహ్నెవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
పంజాబ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్ ప్రస్తుతం మాన్సా జిల్లా (Mansa District)ఎస్పీగా చేస్తున్నారు. ఆమెది హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుప్రీత్ కౌర్ను సీఎం భగవంత్ మాన్ పెళ్లాడారు. ఇక ఆప్ ఎమ్మెల్యేలు నరిందర్ కౌర్ భారజ్, నరిందర్పాల్ సింగ్ సవాన్నలు కూడా ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.