PhD Sabzi Wala | అతను నాలుగు పీజీలు చేశాడు. అంతేకాదు పీహెచ్డీ పట్టా కూడా పుచ్చుకున్నాడు. ఓ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పని చేశాడు. కానీ సమయానికి జీతం ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో ఆ వృత్తిని వదిలేసి కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్కు చెందిన డాక్టర్ సందీప్ సింగ్(39) పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, న్యాయ విద్యలో మాస్టర్స్ పూర్తి చేశాడు. న్యాయ విద్యలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పుచ్చుకున్నాడు. ఇక 11 ఏండ్ల నుంచి పంజాబీ యూనివర్సిటీలోని లా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పని చేశాడు. అయితే జీతం తక్కువగా ఉండటం, సమయానికి ఇవ్వకపోవడంతో సందీప్ సింగ్ బాగా ఇబ్బంది పడేవాడు. కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారింది.
చేసేదేమీ లేక ప్రొఫెసర్ వృత్తికి గుడ్ బై చెప్పి.. కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు. పీహెచ్డీ సబ్జి వాలా అని తన కూరగాయల బండికి బోర్డు తగిలించాడు. ప్రతి రోజు కూరగాయలు అమ్ముతున్నాడు. ఇక ప్రొఫెసర్గా పని చేసినప్పటి కంటే ఇప్పుడే డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్నానని డాక్టర్ సందీప్ సింగ్ తెలిపాడు. కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత దాచి, త్వరలోనే ట్యూషన్ సెంటర్ తెరుస్తానని సందీప్ పేర్కొన్నాడు. వీలు దొరికినప్పుడల్లా చదువుకుంటున్నానని ఆయన చెప్పాడు.