న్యూఢిల్లీ: పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. పటియాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఉదయం తన పార్టీ ముఖ్య అనుచరులతో కలిసి పటియాలాలోని రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన అమరీందర్ సింగ్.. అక్కడి అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ దాఖలుకు ముందు ఆయన గురుగోవింద్ సాహిబ్కు వెళ్లారు. అక్కడ గురుగోవింద్ సాహిబ్ ఖడ్గం నుంచి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం నేరుగా రిటర్నింగ్ ఆఫీస్కు వెళ్లి నామినేషన్ వేశారు. కాగా, పంజాబ్లో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలో దిగుతున్నది.
ఈ కూటమిలో శిరోమణి ఆకాలీదళ్ యునైటెడ్ అనే మరోపార్టీ కూడా భాగస్వామిగా ఉన్నది. నాలుగు రోజుల క్రితమే ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్లో అమరీందర్ పార్టీ కేవలం 37 స్థానాల్లోనే బరిలో దిగుతున్నది. బీజేపీ 65 స్థానాల్లో, ఎస్ఏడీ యునైటెడ్ 15 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.