చండీగఢ్: ప్రభుత్వ పాఠశాల వేలం కోసం పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. రోపర్లోని పవర్ ప్లాంట్ను ఇటీవల మూసి వేశారు. దీంతో అక్కడి థర్మల్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను వేలం వేయాలని నిర్ణయించారు. దీనికి సమీపంలోనే మరో పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రూప్నగర్ జిల్లా కలెక్టర్ సోనాలి గిరి తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ ఈ పనులు చేపడుతుందని చెప్పారు.
కాగా, పంజాబ్లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వానికి చెందిన మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ ప్రభుత్వ స్కూల్ వేలం ప్రకటనపై స్పందించారు. ఏ స్కూల్ను కూడా తాము మూసివేయమని తెలిపారు. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ స్కూల్ వేలం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందని మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు. దీని కోసం గత ప్రభుత్వం ఆరు నెలల కిందటే ఈ పాఠశాలను మూసివేసిందని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ ప్రభుత్వ స్కూల్ వేలం ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. అయితే ఈ పాఠశాల కోసం తమ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు.