అమృత్సర్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లంచం అడిగానే ఆరోపణలు రావడంతో గత మంగళవారం ఏకంగా మంత్రినే క్యాబినెట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. వారిలో పదవీ విరమణ పొందిన పోలీసులు, మత నాయకులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.
కాగా, ఏప్రిల్ నెలలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సహా 184 మందికి భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. వీరిలో పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కుటుంబ సభ్యులు, అమరిందర్ సింగ్ కుమారుడు, అతని భార్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ బజ్వావర్ కూడా ఉన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను సీఎం మాన్ ఈ నెల 24న మంత్రివర్గం నుంచి తొలగించారు. అవినీతికి సంబంధించి బలమైన ఆధారాలు ఉండటంతో విజయ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.