న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh) కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరుతున్నారు. దీంతోపాటు తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని (PLC) బీజేపీలో విలీనం చేయనున్నారు. కెప్టెన్తో పాటు ఆయన కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, మనుమడు నిర్వాణ్ సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కూడా కాషాయ కండువ కప్పుకుంటున్నారు.
కెప్టెన్ అమరిందర్ సింగ్ 2002-07, 2017-2021 మధ్య రెండుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధు, అమరిందర్కు పడకపోవడంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్ అధిష్టానం గతేడాది సెప్టెంబర్లో కెప్టెన్ను బలవంతంగా సీఎం పదవి నుంచి దించివేసింది. దీంతో ఆయన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ అమరీందర్ సింగ్తో పాటు ఆ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నది. 18 స్థానాలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే.