Captain Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. పంజాబ్ ఎన్నికల పోటీపైనే ప్రధానంగా వీరు చర్చించారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, అమరీందర్ సింగ్ (పంజాబ్ లోక్ కాంగ్రెస్) కలిసే ఎన్నికల గోదాలోకి దిగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఇరు పక్షాల మధ్య సీట్ల పంపిణీ వ్యవహారంపై ఓ కమిటీని వేయనున్నారు. ఇక సుఖదేవ్ డింఢసా నేతృత్వంలోని పార్టీ కూడా బీజేపీతో కలిసి రానుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి, పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడుతూ… మూడు పక్షాలూ కలిసే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన మొదలైన కీలక అంశాలపై తాము ఓ కమిటీ నియమించామని, ఈ అంశాలన్నీ ఆ కమిటీయే నిర్ణయిస్తుందని షెకావత్ స్పష్టం చేశారు.