చండీఘఢ్ : అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండా పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ప్రతినిధి ప్రీత్పాల్ సింగ్ బలియవల్ సోమవారం పార్టీని వీడారు. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సరైన వ్యక్తి చేతిలో పెట్టలేదని పార్టీ చీఫ్ సోనియాగాంధీకి రాసిన రాజీనామా లేఖలో ప్రీత్పాల్ సింగ్ పేర్కొన్నారు.
పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసే ప్రభుత్వ, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ప్రతినిధిగా సమర్ధించడం సంక్లిష్టంగా మారిందని సోనియాకు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. సిద్ధూకు పాకిస్తాన్తో సంబంధాలు ఉండటం కూడా పార్టీకి ఇబ్బందికరమైన పరిస్ధితేనని రాసుకొచ్చారు. మరోవైపు పంజాబ్ నూతన సీఎంతోనూ సిద్ధూకు పొసగకపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఇక మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంజాబ్లో అధికార పగ్గాలు చేపడితే పలు పధకాలు, కార్యక్రమాలు చేపడతామని ఆప్ హామీల వర్షం కురిపిస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ సైతం వ్యూహాలకు పదునుపెడుతోంది.