Punjab | పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీ భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చెన్నీ స్పష్టం చేశారు. చిన్న విషయాన్ని బీజేపీ పెద్దదిగా చేసి చూపుతోందని మండిపడ్డారు. ప్రధాని సభకు ప్రజా స్పందన ఏమాత్రం లేదని, ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి భద్రతా విషయాన్ని బీజేపీ ఫోకస్ చేస్తోందని ఆరోపించారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం మోదీ హెలికాప్టర్ ద్వారా ప్రయాణించాల్సి ఉండిందని, కానీ ఒక్కసారిగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని అనుకున్నారని సీఎం పేర్కొన్నారు.
ఇందులో పోలీసులను తప్పుపట్టాల్సిన పనేలేదన్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ప్రధాని కాన్వాయ్ ఆగిందని, ఇక ప్రధాని భద్రతకు ముప్పు ఎలా వాటిల్లుతుందని ప్రశ్నించారు. ఫిరోజ్పూర్ ర్యాలీ సందర్భంగా బీజేపీ వారు 70,000 కుర్చీలను ఏర్పాటు చేశారని, అయితే కేవలం 700 మంది మాత్రమే హాజరయ్యారని, ఇందులో తమ తప్పేంటని సీఎం చెన్నీ ఎద్దేవా చేశారు.