చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రుల మధ్య కయ్యానికి దారితీశాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అవినీతిపరుడంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపణలు చేయడంపై.. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేజ్రివాల్పై పరువు నష్టం దావా వేయనున్నట్లు చన్నీ తెలిపారు. చన్నీ మేనల్లుడి ఇంట్లో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించింది.
ఆ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ సీఎంపై ఆరోపణలు చేశారు. చన్నీ పెద్ద అవినీతిపరుడని, అతని మేనల్లుడి ఇంట్లో భారీగా నగదు దొరికిందని విమర్శించారు. చన్నీ అవినీతి బయటపడినందుకు వచ్చే ఎన్నికల్లో ఆయన స్వయంగా పోటీచేసిన స్థానం నుంచి ఘోర పరాజయం మూటగట్టుకుంటారని కే్జ్రివాల్ జోష్యం చెప్పారు.
కేజ్రివాల్ వ్యాఖ్యలపై చన్నీ తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి ఆధారం లేకుండా తనపై అవినీతి ముద్రవేస్తున్న కేజ్రివాల్పై పరువు నష్టం దావా వేస్తానన్నారు. అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కేజ్రివాల్కు అలవాటుగా మారిందన్నారు. గతంలో ఆయన నితిన్ గడ్కరీ, అరుణ్జైట్లీ, బిక్రమ్సింగ్ మజీతియాలపై కూడా ఆరోపణలు చేసి క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు.