Omicron Effect : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో త్వరలో జరగాల్సిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు అలుముకున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఆందోళనల నేపధ్యంలో బీజేపీ, ఆప్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వాయిదాను కోరుకుంటున్నాయని సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల వాయిదా దిశగా ఈసీ నిర్ణయం తీసుకునేలా ఢిల్లీ, బీజేపీ పాలితరాష్ట్రాలు పావులు కదుపుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల్లో వైరస్ కట్టడి పేరుతో రాత్రి కర్ఫ్యూ విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని పంజాబ్ సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఒమిక్రాన్ ముప్పు పొంచిఉండటంతో కఠిన నియంత్రణల నడుమ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి.
పోలింగ్ కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సకాలంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని లక్నోలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల బృందాన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు కలిసి అభ్యర్ధించారు.