చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మందు ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై కేసు నమోదైంది. కాంగ్రెస్ అభ్యర్థి, గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ అకా సిద్ధూ మూసేవాలాతో కలిసి సీఎం చన్నీ శుక్రవారం మానసలో ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే శుక్రవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగిసినప్పటికీ సీఎం చన్నీ, కాంగ్రెస్ నేతలు ప్రచారం కొనసాగించారని ఆప్ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీఎం చన్నీతోపాటు కాంగ్రెస్ అభ్యర్థి శుభదీప్ సింగ్ సిద్ధూపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 14న ఒకే దశలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రవిదాస్ జయంతి నేపథ్యంలో పోలింగ్ తేదీని ఫిబ్రవరి 20కి ఈసీ మార్చింది. మరోవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్తోపాటు మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.