చండీగఢ్ : బీఎస్ఎఫ్ అధికార పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధావా తీర్మానం ప్రవేశపెడుతూ.. అక్టోబర్ 11న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.
కేంద్రం నోటిఫికేషన్పై జరిగిన చర్చలో హోంమంత్రి రాంధావా మాట్లాడుతూ పంజాబ్ అమరవీరులు, వీరుల భూమి అన్నారు. పంజాబీలు దేశ స్వాతంత్య్ర పోరాటం, 1962, 1965, 1971, 1999 యుద్ధాల్లో అసమానమైన త్యాగాలు చేశారని, దేశంలోనే అత్యధిక శౌర్య పురస్కారాలు పంజాబీలు అందుకున్నారన్నారు. పంజాబ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచాలన్న నిర్ణయం పంజాబ్, ఇక్కడి పోలీసులపై ఉన్న అపనమ్మకం అన్నారు.
ఇది వారికి అవమానమేనని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వాన్ని సంపద్రించాల్సి ఉండాల్సిందన్నారు. పంజాబ్లో శాంతిభద్రలు పటిష్టంగా ఉన్నాయని, బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తరించాల్సిన అవసరం లేదన్నారు. ఇది భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమేనన్నారు. కేంద్రం వెంటనే నోటిఫికేషన్ను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.