న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కొత్త పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సి ఉంది. ఎన్నికల తేదీని వాయిదా వేయాలని ఆ రాష్ట్ర సీఎం చన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఫిబ్రవరి 16వ తేదీన గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఎక్కువ శాతం పంజాబీ సిక్కులు వారణాసికి ప్రయాణిస్తారని, ఈ నేపథ్యంలో 14వ తేదీన జరగాల్సి ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన సీఈసీ సుశీల్ చంద్రకు లేఖ రాశారు. పంజాబ్ సీఎంతో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కూడా ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీని కోరాయి. 117 స్థానాలకు సంబంధించిన కొత్త తేదీని ఇవాళ ఈసీ వెల్లడించింది. పంజాబ్ పార్టీల అభ్యర్థన నేపథ్యంలో ఇవాళ ఎన్నికల సంఘం దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నది.