Sia Goyel : పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించింది. అప్పటికే పెళ్లి కుదిరింది కాబట్టి ఆ పెళ్లి ఇష్టం లేదని కుటుంబసభ్యులకు చెప్పడం కంటే.. కేతన్ను హత్య చేయడమే సులభంగా అనిపించిందని సియా తెలిపింది. పెళ్లి వద్దంటే కుటుంబసభ్యులు బాధపడతారని, కేతన్ను చంపేస్తే సులువుగా పెళ్లి ఆగిపోతుందని సియా భావించింది. ఇదే విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది.
సియా గోయెల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు చెప్పారు. నవంబర్లో జరగాల్సిన పెళ్లిని రద్దుచేస్తే కుటుంబసభ్యులు బాధపడతారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని సియా చెప్పినట్టు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కోసం పుణె, లోనావాలా పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం సియా తల్లిదండ్రులను లోనావాలా సిటీ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఆమె సోదరుడు సాహిల్ గోయల్ను కూడా రెండోసారి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సాహిల్ను దాదాపు 10 గంటలపాటు విచారించిన పోలీసులు.. సియా, చేతన్ పరిచయం గత ఏడాది దీపావళి వేడుకల్లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిందని గుర్తించారు.
ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారని దర్యాప్తులో తేలింది. జనవరి నుంచి ఇప్పటివరకు ఇద్దరి మధ్య రెండు వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు, మొత్తం 238 గంటలపాటు మాట్లాడుకున్నట్లు కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయితే చేతన్తో తమ కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదని సియా తల్లిదండ్రులు చెబుతున్నారు. అతడు కేవలం స్నేహితుడేనని ఆమె న్యాయవాది వాదిస్తున్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అలాగే ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తులను కూడా విచారిస్తున్నారు.