Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ ఇటీవల తన వార్షిక నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. యాప్ ద్వారా అత్యధికంగా బిర్యానీలే ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించింది. అందులో ఢిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తి ఈ ఏడాదిలో 3,300 ఆర్డర్లు ఇచ్చి ‘ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ..’ గా నిలిచాడు. కాగా, ఈ ఏడాదికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను జొమాటో వెల్లడించింది.
పూణె వాసి తేజస్ 2022లో ‘జొమాటో’ యాప్ ద్వారా రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్ను ఆర్డర్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని జొమాటో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘ఇది ట్విట్టర్ ధర కంటే కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. మరో వ్యక్తి ఒకే ఆర్డర్లో రూ.25వేలు విలువ చేసే పిజ్జాలను ఆర్డర్ చేసినట్లు జొమాటో తన నివేదికలో పేర్కొంది. రాహుల్ అనే మరో కస్టమర్ 1,098 కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు తెలిపింది.
ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్లోని రాయ్గంజ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఈ ఏడాది ఆర్డర్ చేశారు. ముంబయికి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్ల ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడు. కాగా, జొమాటో యాప్లో బిర్యానీ తర్వాత ఎక్కువగా పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ తన నివేదికలో తెలిపింది. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.