ముంబై: ఒక కుటుంబం డిన్నర్ చేస్తుండగా పిల్లిని వెంబడిస్తూ ఒక చిరుతపులి ఆ ఇంట్లోకి వచ్చింది. దీంతో చిరుతను చూసి ఆ కుటుంబ సభ్యులు భయంతో హడలిపోయారు. మహారాష్ట్రలోని జున్నార్లో ఈ సంఘటన జరిగింది. చెరకు, ద్రాక్ష తోటలున్న పింపల్వండి ప్రాంతంలో విలాస్ రాయ్కర్ అనే రైతు తన కుటుంబంతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి ఆయన, మిగతా కుటుంబ సభ్యులు భోజనం చేస్తూ టీవీ చూస్తున్నారు. ఇంతలో పిల్లిని వెంబడిస్తూ చిరుతపులి ఆ ఇంట్లోకి వచ్చింది. దానిని చూసి ఆ కుటుంబ సభ్యులు భయపడిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ షాక్ నుంచి చాలా సేపటి వరకు కోలుకోలేకపోయారు. ఆ రాత్రంతా ఇంటి నుంచి బయటకు రాలేదు.
కాగా, విలాస్ మరునాడు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పాడు. ఆ చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేయాలని కోరాడు. తమకు ఆర్థిక స్థోమత లేక ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకోలేకపోయినట్లు తెలిపాడు. తన మాదిరిగానే సమీప ఇళ్లకు కూడా చుట్టూ గోడలు లేవన్నాడు. అలాగే ఈ సంఘటన తర్వాత వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం తన ఇంటి చుట్టూ విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశాడు.