Pune Car accident case : మహారాష్ట్రలోని పుణె సిటీలో జరిగిన పోర్షే కారు ప్రమాదం కేసులో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్కు పుణె జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. మే 31 వరకు ఆ ఇద్దరినీ పోలీస్ కస్టడీకి అప్పగించింది.
ఈ నెల 19న 17 ఏళ్ల మైనర్ ఫూటుగా మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపాడు. దాంతో కారు ఢీకొని ఇద్దరు టెకీలు దుర్మరణం పాలయ్యారు. అయితే రియల్టర్ అయిన మైనర్ తండ్రికి పలుకుబడి ఉండటంతో తన కొడుకును కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు. అందుకోసం ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తన కుమారుడు కాదని, డ్రైవర్ అని చెప్పాడు.
ఈ మేరకు ససూన్ ఆస్పత్రిలో తన కుమారుడి రక్త నమూనాలను కూడా మార్పించాడు. దాంతో ప్రమాదం జరిగినప్పుడు నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించినా.. బ్లడ్ రిపోర్టుల్లో మాత్రం అతను మద్యం ముట్టనట్లుగా వచ్చింది. ఈ విషయం బయటికి రావడంతో బ్లడ్ శాంపిల్స్ మార్చిన ఇద్దరు డాక్టర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే తన మనుమడిని కేసు నుంచి తప్పించడం కోసం అతని తాత సురేంద్ర అగర్వాలే డ్రైవర్ను కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో గత శనివారం అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ మార్పిండంతో మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్ను అంతకుముందే అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ కూడా ప్రస్తుతం జువైనల్ హోమ్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇవాళ నిందితులు విశాల్ అగర్వాల్, సురేంద్ర అగర్వాల్లను పోలీసులు పుణె జిల్లా కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఇద్దరికీ ఈ నెల 31 వరకు పోలీస్ కస్టడీ విధించింది.