(స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కార్గిల్, పుల్వామా ఘటనలకు ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని పలువురు మాజీ సైనికాధికారులు అభిప్రాయపడ్డారు. గత ఆదివారం మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన పలు చర్చా కార్యక్రమాల్లో దేశ భద్రత, భారత్-ఆస్ట్రేలియా రక్షణ, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అంశాలపై మేధోమథనం జరిగింది. ఈ చర్చల్లో.. ‘కార్గిల్ యుద్ధం, పుల్వామా దాడి, గల్వాన్ ఘటన.. ఇవన్నీ భారత ఇంటెలిజెన్స్ నిర్వహణ లోపాలే. వాటిని ఆసరా చేసుకొనే పాక్, చైనా దాడులు చేస్తూనే ఉన్నాయి.
ఇంటెలిజెన్స్ వ్యవస్థ దేశ భద్రతలో అత్యంత తీవ్రమైనది. పాత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పటి ప్రభుత్వాలు సీరియస్గా దృష్టిసారించాలి. సరిహద్దు భద్రత అయినా, అంతర్గత భద్రత అయినా, ఈ రెండూ బలమైన అంతర్గత ఇంటెలిజెన్స్ వ్యవస్థతో ముడిపడి ఉంటాయి’ అని తెలిపారు. ఏ దేశానికైనా ఉగ్రవాదం పెద్ద సవాలు అని, దీన్ని ఎదుర్కోవడానికి ఉన్నతస్థాయి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరమని రిటైర్డ్ మేజర్ జనరల్ ఏపీ సింగ్ నొక్కిచెప్పారు. దేశ భద్రతకు కౌంటర్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యమైన ఆయుధమని వెల్లడించారు. కార్గిల్, పుల్వామా ఘటనల తర్వాత పాక్పై పైచేయి సాధించామని జబ్బలు చరుచుకున్న బీజేపీ.. ఎన్నికల్లో లబ్ధిపొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సైనికాధికారులు చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మింగుడుపడటం లేదు.