న్యూఢిల్లీ: పులిట్జర్ అవార్డు అందుకొనేందుకు అమెరికా వెళ్లనీయకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకున్నారని కశ్మీరీ ఫొటో జర్నలిస్టు సన్నా ఇర్షాద్ మట్టూ బుధవారం పేర్కొన్నారు. వీసా, టికెట్ ఉన్నా విమానం ఎక్కనీయకుండా ఆపారని, ఎంత అడిగినా కారణం మాత్రం చెప్పకుండా టికెట్ రద్దు చేశారని ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోర్డింగ్ పాస్ వెనక్కు ఇచ్చిన అధికారులు.. సమస్య ఏంటని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదని తెలిపారు. అమెరికా వెళ్లకుండా తనను ఎందుకు అడ్డుకొన్నారో అర్థం కావడం లేదని, ‘నా వృత్తి గురించా? లేక మరేదైనా ఉన్నదా?’ అనేది తనకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించలేదు.