న్యూఢిల్లీ: దేశానికి మెడల్స్ సాధించిన టాప్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పునియా తదితరులు మరోసారి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజులుగా నిరసన (wrestlers protest) చేస్తున్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ అంశంపై స్పందించాలని కోరుతూ భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, దర్యాప్తు కమిటీ చీఫ్ అయిన పీటీ ఉషకు లేఖ రాశారు.
కాగా, మల్లయోధుల నిరసనను పీటీ ఉష తప్పుపట్టారు. భారత ప్రతిష్టను వారు దిగజార్చుతున్నారని ఆరోపించారు. క్రీడాకారులు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం తగదని అన్నారు. కమిటీ రిపోర్ట్ వచ్చే వరకైనా వారు వేచి ఉండాల్సిందని చెప్పారు. ‘వారు చేసిన పని క్రీడకు, దేశానికి మంచిది కాదు. ఇది ప్రతికూల విధానం’ అని విమర్శించారు. రెజ్లర్లు నిరసన చేయడం క్రమశిక్షణారాహిత్యమని అన్నారు.
మరోవైపు పీటీ ఉషా చేసిన ఈ వ్యాఖ్యలపై రెజ్లర్ బజరంగ్ పునియా స్పందించారు. ఐవోఏ అధ్యక్షురాలి నుంచి తాము మద్దతు ఆశించామని, అయితే ఇలాంటి కఠిన స్పందనను తాము అసలు ఊహించలేదని మీడియాతో అన్నారు. కాగా, బ్రిజ్భూషణ్పై కేసు నమోదు కోసం రెజ్లర్లు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సీరియస్ అంశంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం, ఢిల్లీ పోలీసులకు నోటీస్ జారీ చేయాలని గురువారం ఆదేశించింది.