న్యూఢిల్లీ: భారతదేశపు దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి వచ్చే నెల 10న ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్లకు గడువు ఆదివారమే ముగిసింది. అయితే ఉషకు పోటీగా వేరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
దాంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు పొందారు. అంతేగాక మహారాజా యాదవీంద్ర సింగ్ (1934, క్రికెట్) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి స్పోర్ట్స్ పర్సన్గా కూడా ఆమె ఘనత దక్కించుకున్నారు.
కాగా, 1984 ఒలింపిక్స్లో 400 మీటర్ల హర్డిల్స్లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఉష.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో ఉష మెరిసింది. ఒక్క ఆసియా క్రీడల్లోనే ఆమె 14 స్వర్ణాలతోపాటు 23 పతకాలు గెలుచుకుంది.