రాయపూర్ : ఛత్తీస్గఢ్లో 8 మందికి విషమిచ్చి చంపిన ‘సైకో కిల్లర్’ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బలోదాబజార్ జిల్లా ఖార్వీ గ్రామంలో వరుస హత్యలకు పాల్పడుతున్న రామ్ సహాయ్ జైశ్వాల్(46)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జైశ్వాల్ బాధితుల అంత్యక్రియలకు హాజరవుతూ, తన కదలికలపై అనుమానం రాకుండా చూసుకున్నాడని, బాధిత కుటుంబాలను కలుసుకునేవాడని పోలీసులు తెలిపారు.
చివరి హత్య జరిగిన నెల రోజుల తర్వాత సైకో కిల్లర్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఫిబ్రవరి-మే మధ్య కాలంలో దారుణమైన వరుస హత్యల పరంపర ఆ గ్రామాన్ని పట్టిపీడించింది. చిన్నపాటి వివాదాల కారణంగా బాధితులపై పెంచుకున్న పగ, ప్రతీకారం, మానసిక అసహనంతో సైకో కిల్లర్ జైశ్వాల్ ఈ హత్యలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రాణాంతకమైన ‘బోరాక్స్ పౌడర్’ను గత కొంతకాలంగా 8 మంది పురుషులకు ఇచ్చి చంపినట్టు పోలీసులు చెప్పారు. సైకో కిల్లర్ హత్యలపై పోలీసులు గత రెండు వారాలుగా దర్యాప్తు సాగిస్తున్నారు.