Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో ఉద్యోగం సంపాదించాలని ప్రతి యువకుడు కలలు కనేవాడని, కానీ తమకు అశ్రితులుగా ఉన్న కొద్ది మంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల మంది యువత ఆశలు అణచేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆదివారం ట్వీట్ చేశారు.
‘పీఎస్యూలను దేశానికి గర్వకారణం అనియువత భావించే వారు. ప్రతి యువకుడు వాటిల్లో ఉద్యోగం పొందాలని కల కనే వాడు. కానీ ఈనాడు యువతకు ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యాలు కాదు’ అని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగాలు ఉంటే, 2022 నాటికి 14.6 లక్షలకు పడిపోయాయి` అని పేర్కొన్నారు.
‘అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు తగ్గిపోవడమా? బీఎస్ఎన్ఎల్లోనే 1.81 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి. సెయిల్లో 61,928, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,1410, ఎఫ్సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి’ అని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
‘2014 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బూటకపు వాగ్ధానాలు చేసిన వారే ఈనాడు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కుదించారు. ఈ సంస్థల్లో కాంట్రాక్ట్ నియామకాలు దాదాపు రెట్టింపయ్యాయి. చివరకు ఈ కంపెనీలను ప్రైవేట్ వారికి అప్పగించే కుట్ర దాగి ఉందా?’ అని రాహుల్ ప్రశ్నించారు.
పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేసి, ప్రభుత్వోద్యోగాలు తగ్గించడమే `అమృత్ కాల్`పాలనకు నిదర్శనమా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పీఎస్యూల్లో సానుకూల వాతావరణం నెలకొంటే, ప్రభుత్వ మద్దతు లభిస్తే, ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి` అని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రజల ఆస్తులని, వాటిని ప్రమోట్ చేస్తే, భారత్ వృద్ధిని బలోపేతం చేస్తాయని రాహుల్ గాంధీ తెలిపారు.