PSLV C-62 : పీఎస్ఎల్వీ సీ-62 (PSLV C-62) రాకెట్ మరికొన్ని గంటల్లో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంరది. శ్రీహరికోట (Sriharikota) లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రేపు (సోమవారం) ఉదయం 10.17 గంటలకు ఇస్రో (ISRO) ఈ రాకెట్ను ప్రయోగించనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాకెట్ ప్రయోగానికి 24 గంటల ముందు అంటే ఇవాళ ఉదయం 10.17 గంటలకు కౌంట్డౌన్ కూడా మొదలైంది.
ఈ రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 (EOS-N1) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది. ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి నారాయణన్, శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ పూజలు చేశారు.
రాకెట్, ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తిరుమలలో మీడియాతో మాట్లాడారు. పీఎస్ఎల్వీ సీ-62 రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నామని చెప్పారు. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకమని, ఇది 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమని అన్నారు.
పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వదని నారాయణన్ తెలిపారు. ఈ మిషన్ ద్వారా మొత్తం 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నామని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందని వెల్లడించారు.