భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం నిర్వహించిన పీఎస్ఎల్వీ-సీ 53 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలోని సతీశ్ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. కౌంట్డౌన్ ముగియగానే ఇస్రో ఈ రాకెట్ను రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. పీఎస్ఎల్వీ- సీ53 సింగపూర్, కొరియాకు చెంది మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 55వ ప్రయోగం.
పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్.. సింగపూర్కు చెందిన 365 కిలోల డీఎస్-ఈఓ ఉపగ్రహం, 155 కిలోల న్యూసార్, 2.8 కిలోల స్కూబ్-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో వాణిజ్యపరమైన రెండో మిషన్ ఇది. ప్రయోగం విజయవంతం కాగానే, ఇస్రో శాస్త్రవేత్తలంతా సంబురాల్లో మునిగితేలారు. చప్పట్లుకొడుతూ, ఒకరికొకరు అభినందించుకున్నారు.