పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ (పీఎస్ఐ) రిక్రూట్మెంట్ స్కామ్ కర్ణాటకలోని బీజేపీ సర్కారు మెడకు చుట్టుకున్నది. బీజేపీ నేతలు, ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగినట్టు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అదనపు డీజీపీతో సహా ఇప్పటివరకూ 60 మందిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కుంభకోణం వెనుక బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్ర పాత్ర ఉన్నదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఏమిటీ స్కామ్?
545 సివిల్ పీఎస్ఐ పోస్టుల కోసం గత అక్టోబర్ 3న పరీక్ష నిర్వహించారు. 54 వేల మంది ఉద్యోగార్థులు పరీక్ష రాశారు. ఈ జనవరి 19న ఫలితాలు వెల్లడయ్యాయి. 271 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఇన్విజిలేటర్ల సాయం, బ్లూటూత్ హై టెక్ కాపీయింగ్తో కొందరు టాప్ ర్యాంకులు సాధించారని, దీనికి అధికార పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు సాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
స్కామ్ ఎలా బయటపడింది?
పరీక్ష మెరుగ్గా రాసినప్పటికీ, తాను సెలక్ట్ కాకపోవడం, తనకంటే చదువులో ఎప్పుడూ తక్కువస్థాయిలో ఉండే తన మిత్రుడు వీరేశ్కు ఏడో ర్యాంక్ రావడంపై అనుమానం వ్యక్తం చేసిన శ్రీధర్ పవార్ అనే అభ్యర్థి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కార్భన్ కాపీ ఇవ్వాల్సిందిగా అధికారులకు దరఖాస్తు చేశాడు. దాంట్లో 21 ప్రశ్నలకు సమాధానాలు రాసినప్పటికీ, వీరేశ్కు 121 మార్కులను కేటాయించారు. దీంతో పవార్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కేసు విచారణ సీఐడీకి చేరింది. లోతుగా విచారణ చేపట్టగా అసలు డొంక కదులుతున్నది.
సూత్రధారులు వీళ్లే!
తక్కువ మార్కులు వచ్చినప్పటికీ, ఐదుగురికి టాప్ ర్యాంకులు ఇవ్వడంపై సీఐడీ తొలుత దృష్టిసారించింది. వాళ్లు పరీక్ష రాసిన కలబురగిలోని స్కూల్లో విచారించగా.. స్కూల్ యజమాని, బీజేపీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు దివ్య హగరాగీ, ఆమె భర్త స్కామ్కు ప్రధాన సూత్రధారులుగా నిర్ణయానికి వచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్ సెల్ మాజీ హెడ్, అదనపు డీజీపీ అమృత్ పౌల్ పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు విచారణలో తేలింది. దీంతో ఆయనతో పాటు హగరాగీ దంపతులు, ఎగ్జామ్లో అక్రమాలకు పాల్పడిన టాపర్లు, సాయపడిన టీచర్లు ఇలా 60 మందికి పైగా అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నది.
మీ హయాంలో స్కామ్లు జరుగలేదా?
పీఎస్ఐ స్కామ్లో మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు విజయేంద్రన్ పాత్ర ఉన్నట్టు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. సీఎం బసవరాజ్ బొమ్మై, మంత్రులు కూడా ఈ స్కామ్లో భాగమేనన్నారు. ర్యాంకు కోసం ఒక్కో అభ్యర్థి రూ. 30 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించినట్టు పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి.. మీ (కాంగ్రెస్) హయాంలో కుంభకోణాలు జరుగలేదా? అని సీఎం బొమ్మై ఎదురు ప్రశ్న వేయడాన్ని చూస్తే స్కామ్కు పాల్పడ్డామని బీజేపీ నేతలు ఒప్పుకున్నట్టుగానే కనిపిస్తున్నది.