Protests : రాష్ట్ర హోదా కల్పించాలంటూ లఢఖ్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. లడఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్తోపాటు మరో మూడు ప్రధాన డిమాండ్లను కూడా నిరసనకారులు వినిపిస్తున్నారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు, లడఖ్-కార్గిల్లకు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయింపు అనే డిమాండ్లను నిరసకారులు లేవనెత్తుతున్నారు.
ఈ క్రమంలో నిరసనకారులు ఆదివారం లఢఖ్ అంతటా బంద్కు పిలుపునిచ్చారు. శనివారం లడఖ్లోని లేహ్ జిల్లాలో భారీ నిరసన ర్యాలీలు చేశారు. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) బంద్కు పిలుపునిచ్చింది. లడఖ్కు రాష్ట్ర హోదా, గిరిజన హోదాను డిమాండ్ చేస్తూ జనవరి 23న కేంద్ర హోంశాఖకు మెమోరాండం కూడా సమర్పించారు. లడఖ్కు రాష్ట్ర హోదా కోసం 2019 నాటి జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు ముసాయిదాను కూడా ఇచ్చారు.
LAB, KDA న్యాయ సలహాదారు హాజీ గులామ్ ముస్తఫా మాట్లాడుతూ.. ‘లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి మా అధికారాలు బలహీనపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు మాకు అసెంబ్లీలో నలుగురు, శాసన మండలిలో ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు’ అని అన్నారు.
లడఖ్-లేహ్, కార్గిల్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులతో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ నిరసనలు వెల్లువెత్తాయి. కాగా, డిసెంబర్ 4న జరిగిన భేటీలో కేంద్ర హోంశాఖ రెండు సంస్థల నుంచి డిమాండ్ల జాబితాను కోరింది.