Manipur : మణిపూర్ బీజేపీలో ఒక్కసారిగా అసహనం పెల్లుబికింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బీజేపీ మద్దతు దారులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అంతేకాకుండా మణిపూర్లోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్లకార్డులను చేతపట్టుకొని, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యాలయాలకు పోలీసులు రక్షణగా నిలిచారు. కొందరు నేతలు ఏకంగా బీజేపీకి రాజీనామా కూడా చేసేశారు. అయితే ఇప్పటి వరకూ ఎంత మంది నేతలు బీజేపీకి రాజీనామా చేశారన్నది మాత్రం తేలియరాలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి మాత్రమే టిక్కెట్ల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం కల్పించారని, పాత తరం వారిని, చాలా రోజులుగా జెండాలు మోస్తున్న వారిని మాత్రం పక్కన పెట్టేశారని సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.