చండీగఢ్: హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. బీజేపీ పాలిత హర్యానాలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లో దీనిని పునురిద్ధరించినట్లు తెలిపారు. పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరిద్ధరించారని పోరాట కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పలు పెన్షన్లు పొందుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గత కొన్ని రోజులుగా పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఆదివారం పంచకుల-చండీగఢ్ సరిహద్దు వద్దకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చండీగఢ్లోకి ప్రవేశించి హర్యానా సీఎం అధికార నివాసం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యానాన్లతో నీటిని వెదజల్లారు. నిరసనకారులపైకి టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు ఎంతో ప్రయోజనకరమైన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.