చండీగఢ్: పంజాబ్ రైతులు పలు సమస్యలపై ఆ రాష్ట్రంలో నిరసనలు కొనసాగిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో పలు చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని గురువారం రైతు సంఘాల నేతలు కలిశారు. పలు డిమాండ్లను లేవనెత్తారు. రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, ఆ సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, హైవే ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమికి పరిహారం చెల్లించాలని, రైతు వాహనాలకు టోల్ ఫీజు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
కాగా, రైతులతో సమావేశం బాగానే జరిగిందని సీఎం చన్నీ తెలిపారు. చాలా సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. రెండు లక్షల వరకు రైతు రుణాలను మరో 10-12 రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పారు. రైతు వాహనాలకు టోల్ రుసుం నుంచి మినహాయింపుపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడతానని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో తదుపరి సమావేశం ఈ నెల 29న జరుగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఏక్తా ఉగ్రహన్ పంజాబ్ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ తెలిపారు.