చండీగఢ్: యువకుడి మరణంపై స్థానికులు నిరసన తెలిపారు. రైల్వే స్టేషన్లోని రైలు పట్టాలపై బైఠాయించి (sit in at railway station) ఆందోళనకు దిగారు. పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దూది గ్రామానికి చెందిన జగ్జీవన్ సింగ్ అనే యువకుడు కొన్ని రోజుల కిందట తీవ్ర గాయాలతో రైలు పట్టాల వద్ద కనిపించాడు. అతడ్ని ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ నేపథ్యంలో జగ్జీవన్ సింగ్ కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి నిరసనకు దిగారు. వారంతా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ రైలు పట్టాలపై బైఠాయించారు. యువకుడి మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు జగ్జీవన్ సింగ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని, అలాగే రైలు పట్టాలను వీడబోమని స్పష్టం చేశారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రైలు పట్టాలపై బైఠాయించి నిరసన చేస్తున్న గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే తమ డిమాండ్ నెరవేరే వరకు అక్కడి నుంచి వెళ్లబోమని పోలీసులకు తెగేసి చెప్పారు.