నాగావ్, జూలై 10: దేశంలో పెరిగిపోతున్న పెట్రో, నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంపై దేవతల వేషంలో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకు ఓ వ్యక్తిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో కడుపు మండిన ఓ వ్యక్తి.. శివుడి వేషం ధరించి నాగావ్ వీధుల్లో నిరసన చేపట్టాడు. తనతో పాటు ఓ మహిళకు పార్వతి వేషం వేయించాడు. వీరిద్దరు వీధుల్లో నాటకాన్ని ప్రదర్శిస్తూ మోదీ సర్కారు తీరును ప్రశ్నిస్తుండగా.. భజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అడ్డుకొని వారిని కొట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అనంతరం నోటీసు జారీ చేసి బెయిల్పై విడుదల చేశారు. కాగా, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తే అరెస్టు చేయటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.