జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు
350 మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా
బీజేపీ పాలిటిక్స్కు బలిపశువులు అయ్యాం
ప్రాణభయం ఉన్నదన్నా పట్టించుకోలేదు
మోదీ.. భద్రత లేకుండా కశ్మీర్కు రాగలవా?
ప్రధానికి మృతుడి భార్య మీనాక్షి భట్ సవాల్
బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడరేం: విపక్షాలు
‘కశ్మీరీ పండిట్లను ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా బలిపశువులను చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని మీ రాజకీయాలకు వాడుకుంటారు? ఇప్పటికీ కశ్మీర్లో మా బాధలు తీరలేదు. అయితే, ఇవేమీ మీకు పట్టట్లేదు. మోదీ, అమిత్ షా.. మీకు ఇదే నా సవాల్. దమ్ముంటే భద్రతా సిబ్బంది లేకుండా కశ్మీర్లో పర్యటించండి. మేమిక్కడ ఎంత అభద్రతతో ఉన్నామో మీకు తెలుస్తుంది’.. ఉగ్రవాదుల దాడిలో భర్తను కోల్పోయిన ఓ కశ్మీరీ పండిట్ ఆడపడుచు దేశ ప్రధానికి చేసిన సవాల్ ఇది. బద్గాం జిల్లా రెవెన్యూ ఉద్యోగి, కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను ఉగ్రవాదులు హత్యచేయడం కశ్మీర్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని బీజేపీ నేతలు రాజకీయాల కోసం వాడుకొన్నారు. పండిట్ల భద్రత కోసం ఏమైనా చేస్తామని హామీలు గుప్పించారు. ఇప్పుడు కష్టాల్లో ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని కశ్మీరీ పండిట్లు, విపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
శ్రీనగర్, మే 13: కశ్మీరీ పండిట్లపై తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాను అందరూ చూడాలని ప్రధాని మోదీ మొదలుకొని చోటా మోటా నేతల వరకు బీజేపీ నేతలంతా విస్తృతంగా ప్రచారం చేశారు. పండిట్ల సంక్షేమం కోసం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ వాగ్దానాలు ఇచ్చారు. అయితే పండిట్లపై వారు ఒలకబోసిన ప్రేమ బూటకమని తేలిపోయింది. రాజకీయ లబ్ధి కోసం పండిట్లను వాడుకుంటున్నారని రూఢీ అయిపోయింది. జమ్ముకశ్మీర్లోని బద్గాం జిల్లా ఛాదోరాలో ఉన్న రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి, కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపిన ఘటన కశ్మీర్లో ఉద్రిక్తతలు రాజేసేంది. తనకు ప్రాణహాని ఉందని, బదిలీ చేయాలని బాధితుడు మొరపెట్టుకున్నా కేంద్రం, జమ్ముకశ్మీర్ అధికారం యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చివరికి అతడు ఉగ్రవాదులకు బలైపోయాడు. దీనిపై కశ్మీరీ పండిట్లు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 350 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. తన భర్త మరణం కేంద్రప్రభుత్వ పెద్దలకు కనిపించడం లేదా? అంటూ మృతుడి భార్య మీనాక్షి భట్ రోదిస్తూ కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఎలా మేము బతికేది?
కశ్మీరీ పండిట్ అయిన తన భర్తను ఉగ్రవాదులు తుపాకులతో కాల్చిచంపితే మోదీ, షా నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని మీనాక్షి భట్ మండిపడ్డారు. ‘మీరు మాకిచ్చిన అభయహస్తం.. మీ మాయమాటలు నమ్మి మేము బతికేది ఎలా?’ అని ఆమె నిలదీశారు. ప్రాణ ముప్పుతో తన భర్త రాహుల్ భట్ నిరంతరం భయపడేవారని, ఛాదోరా నుంచి జిల్లా హెడ్క్వార్టర్కు బదిలీ చేయాలని పలుసార్లు అధికారులకు విన్నపించారని తెలిపారు. అయినా అధికారులు పట్టించుకోలేదని, చివరికి తన భర్త ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గురువారం తన భర్తతో మాట్లాడానని, ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పారని, ఇంతలోనే ఆయన హత్య వార్త వినాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరు అయ్యారు. కార్యాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉగ్రవాదులతో కుమ్మక్కై తన భర్తను హత్య చేశారని ఆరోపించారు.
రాజకీయ ప్రకంపనలు
రాహుల్ భట్ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. బహిరంగంగా హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ ప్రకటనలు చేయడం, మసీదుల్లో లౌడ్స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేయడంలాంటివి కశ్మీరీ పండిట్ల సమస్యలను పరిష్కరించలేవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కశ్మీర్కు చెందిన ప్రధాన పార్టీలు కూడా కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి.
పెల్లుబికిన నిరసనలు
రాహుల్ భట్ను ఉగ్రవాదులు చంపడంపై నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం కశ్మీర్లోని బుద్గాం జిల్లా నుంచి శ్రీనగర్ విమానాశ్రయం వరకు కశ్మీరీ పండిట్లు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు, రాహుల్ భట్ హత్యను నిరసిస్తూ 350 మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేశారు. వీరంతా కశ్మీరీ పండిట్ సామాజిక వర్గానికి చెందినవాళ్లే. తమకు భద్రత కల్పించడంలో కేంద్రం, రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని వాళ్లు మండిపడ్డారు. రాహుల్ భట్ హత్యకేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. భట్ హత్యకు కారణమైన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు పేర్కొన్నారు.