ఐదుగురు సంతానం ఉన్న ఇంటిపెద్ద మార్కెట్ నుంచి పది అరటిపండ్లు తీసుకొచ్చాడు. బిడ్డలందరూ తండ్రికి సమానం కాబట్టి ఒక్కొక్కరికి రెండు చొప్పున పండ్లు పంచాలి. అయితే, ఒకరికి నాలుగు పండ్లు ఇచ్చిన ఆ తండ్రి.. మిగతా నలుగురికి ఆరు పండ్లు ఇచ్చి సరిపెట్టుకోమన్నాడు. ఇది న్యాయంగా కనిపిస్తున్నదా? దేశ ప్రధాని నరేంద్రమోదీ వైఖరి కూడా అచ్చం ఇలాగే ఉన్నది. దేశంలోని అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన ప్రధాని.. కేవలం తన స్వరాష్ట్రం గుజరాత్ మీదనే అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు. ఫలితం.. గడిచిన 8 ఏండ్లలో ఆ రాష్ర్టానికి ఏకంగా రూ. 5 లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులు తరలిపోయాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘తాయిలాలు చూపించి ఎన్నికల్లో గెలుపొందవచ్చేమో గానీ దేశాన్ని మాత్రం నడుపలేం. ఎరవేసి ఓటర్లను ఆకట్టుకోవడం మాకు చేతకాదు’.. 2016లో గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన ఈ రెండు వ్యాఖ్యల్లో మొదటిది నిజం. రెండోది అబద్దం. ‘నల్లధనాన్ని వెలికితీస్తా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా’ అంటూ అబద్ధపు హామీలు, ఆశలు చూపించి ప్రధాని పీఠం ఎక్కిన మోదీ.. దేశాన్ని ప్రగతిపథంలో నడుపలేక చేతులెత్తేశారు. ఫలితం.. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ముంగిట్లోకి వెళ్లింది. ఎరవేసి ఓటర్లను ఆకట్టుకోవడం తమకు చేతకాదంటూ మోదీ చెప్పినప్పటికీ, రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలన్న లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రజలకు వరాల వర్షం కురిపిస్తున్నారు. అందుకే గడిచిన పది నెలల్లోనే ఆ రాష్ర్టానికి ఏకంగా రూ.1.22 లక్షల కోట్ల ప్రాజెక్టులను కట్టబెట్టారు. ఇలా 2014 నుంచి ఇప్పటివరకూ రూ.5 లక్షల కోట్ల పైచిలుకు విలువైన ప్రాజెక్టులను గుజరాత్కు కేటాయించారు.
15 శాతం ప్రాజెక్టులు గుజరాత్కే..
2014, మేలో పగ్గాలు చేపట్టింది మొదలు గుజరాత్కు నిధుల వరద పారించడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నది. 2014 నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ. 35 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ. 5,22,167 కోట్ల విలువైన ప్రాజెక్టులను (దాదాపు 15%) మోదీ.. గుజరాత్కే తరలించారు. అంటే.. కేంద్రం మంజూరుచేసిన ప్రతీ ఏడు ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టును గుజరాత్కే కేటాయించినట్టు అర్థమవుతున్నది.
ఇతర రాష్ర్టాల ప్రాజెక్టులూ అటే..
తెలంగాణకు రావాల్సిన భారీ ప్రాజెక్టులను మోదీ సర్కారు కుట్రలతో బీజేపీపాలిత రాష్ర్టాల కు పట్టుకుపోయిన చరిత్ర కూడా ఉన్నది. హైదరాబాద్లో డబ్ల్యూహెచ్వో తలపెట్టిన సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్.. గుజరాత్లోని జామ్నగర్కు తరలిపోయింది. తెలంగాణ కోసం 20 13లో అప్పటి యూపీఏ సర్కారు ఆమోదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీసర్కారు పక్కనపెట్టింది. మిషన్ భగీరథ కోసం రూ. 2,350 కో ట్లు విడుదల చేయాలని 15వ ఫైనాన్స్ కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసినా.. ఆ నిధులు ఇంకా మంజూరుకాలేదు. మహారాష్ట్ర నుంచి రూ. 30 వేల కోట్ల విలువైన బల్క్ డ్రగ్ పార్క్, రూ. 2.0 6 లక్షలకోట్ల విలువైన ఫాక్స్కాన్-వేదాంత సెమీకండక్టర్స్ ప్లాంట్, రూ. 22 వేల కోట్ల విలువైన టాటా-ఎయిర్బస్ సీ-295 మ్యానుఫ్యాక్చరిం గ్ ప్రాజెక్ట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ తదితర ప్రాజెక్టులు గుజరాత్కు వెళ్లాయి.
ఎన్నికల ముందు.. మరింత ఎక్కువగా..
2014 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల్లో 40 శాతానికి పైగా ప్రాజెక్టులను కేంద్రం ఒక్క గుజరాత్లోనే చేపట్టడం గమనార్హం. అనంతరం 2017, డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. పోలింగ్కు 9 నెలల ముందు నుంచే గుజరాత్లో రూ. 48 వేల కోట్ల ప్రాజెక్టులకు శరవేగంగా శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను రాష్ర్టానికి అదనంగా కట్టబెట్టారు. ఇక, 2019 లోక్సభ ఎన్నికల సమయంలో గుజరాత్కు రూ. 82 వేల కోట్ల ప్రాజెక్టులు ధారాదత్తం చేసిన కేంద్రసర్కారు.. ఈ డిసెంబర్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ర్టానికి రికార్డు స్థాయిలో రూ. 1,22,360 కోట్ల ప్రాజెక్టులను ఖరారు చేసింది. కాగా, 2024లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల ముందు వస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువటం కమలదళానికి అనివార్యం. ఈ నేపథ్యంలోనే మోదీ ఆ రాష్ట్రంపై నిధుల వరద పారిస్తున్నారు.
గడిచిన ఎనిమిదేండ్లలో ఇలా..
గుజరాత్కు మోదీ ప్రకటించిన వరాల్లో కొన్ని..
క్రూడాయిల్ రాయల్టీ (రూ.763 కోట్లు), రాజ్కోట్కు ఎయిమ్స్, లైట్హౌస్ ప్రాజెక్టు, బుల్లెట్ ట్రైన్, రైల్ కనెక్టివిటీ టు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి నేషనల్ యూనివర్సిటీ హోదా, రక్షా శక్తి యూనివర్సిటీకి జాతీయ హోదా, గుజరాత్ ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా (జామ్నగర్), నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (జామ్ నగర్), గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ ఫోర్ట్ (రాజ్ కోట్).
గుజరాత్కు ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా..
సంవత్సరం : ప్రాజెక్టుల విలువ (రూ. కోట్లలో)
2014 : 86,949
2015 : 31,074
2016 : 37,895
2017 : 48,072
2018 : 35,401
2019 : 81,901
2020 : 36,809
2021 : 45,980
2022 : 1,22,360