Har Ghar Jal | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘2024 ఏప్రిల్నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం’ అంటూ 2019 ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కాపీ కొట్టి ‘హర్ ఘర్ జల్’ అంటూ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే, క్షేత్రస్థాయిలో ‘హర్ ఘర్ జల్’ పథకం నత్తనడకన సాగుతున్నట్టు జాతీయ ఇంగ్లీష్ పత్రిక ‘ది హిందూ’ ఓ కథనంలో వెల్లడించింది. నిర్ణీత సమయంలో ఈ స్కీమ్ అనుకొన్న లక్ష్యాన్ని చేరడం కష్టమేనని తేల్చిచెప్పింది.
జలశక్తి మినిస్ట్రీకి చెందిన జల్ జీవన్ మిషన్లో భాగంగా ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని తీసుకొచ్చారు. 2019లో పనులు ప్రారంభించిన ఈ స్కీమ్లో భాగంగా జూలై 2నాటికి 64 శాతం ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు పత్రిక తెలిపింది. వచ్చే మార్చినాటికి 75 శాతం కనెక్షన్లు ఇవ్వడం కూడా సాధ్యంకాకపోవచ్చేమోనని అభిప్రాయపడింది. ఇచ్చిన అన్ని నల్లా కనెక్షన్లలో నీటి సరఫరా జరుగాలంటే మరింత సమయం పట్టొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దేశంలోని 5 శాతం గ్రామాల్లో ఇప్పటికీ ‘హర్ ఘర్ జల్’ పథకం పనులే ప్రారంభంకాలేదని వెల్లడించింది. అయితే, కరోనా సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ముడి సరుకు దిగుమతులకు ఇబ్బందులు తలెత్తాయని, దీని కారణంగానే పనులు ఆలస్యమైనట్టు ఓ అధికారి చెప్పినట్టు పత్రిక వెల్లడించింది.
దేశంలోని మొత్తం ఆవాసాలు 19,46,16,893
2019నాటికి నల్లా కనెక్షన్లు 3,23,62,838
ఇప్పటివరకూ ఇచ్చిన కనెక్షన్లు 12,46,69,792
స్కీమ్లో భాగంగా 48 నెలల్లో ఇచ్చిన కనెక్షన్లు 9,23,06,954
వచ్చే 8 నెలల్లో ఇవ్వాల్సిన కనెక్షన్లు 6,99,47,101