చండీగఢ్: యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన వ్యక్తి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Haryana Professor) యూనివర్సిటీలోని ఆ ప్రొఫెసర్ ఆఫీస్లో ఇద్దరి మృతదేహాలను భార్య గుర్తించింది. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల సందీప్ గోయల్ 2016 నుంచి హిసార్లోని లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 8 ఏళ్ల కుమార్తెతో కలిసి స్కూటర్పై రైడ్కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు. అయితే యూనివర్సిటీలోని తన కార్యాలయానికి కూతుర్ని తీసుకెళ్లాడు. అక్కడ సర్జికల్ బ్లేడ్తో ఆమె గొంతు కోసి చంపాడు. అనంతరం అదే బ్లేడ్తో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, భర్త సందీప్, కుమార్తె తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య ఆందోళన చెందింది. యూనివర్సిటీకి వెళ్లి చూడగా వెటర్నరీ సర్జరీ, రేడియాలజీ విభాగం బయట సందీప్ స్కూటర్ కనిపించింది. అక్కడి గేటు మూసి ఉండటంతో సెక్యూరిటీ గార్డును పిలిచింది. ఆఫీస్ గదిలోకి వెళ్లి చూడగా భర్త సందీప్, కుమార్తె రక్తం మడుగుల్లో మరణించి ఉన్నారు. దీంతో షాకైన భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది.
మరోవైపు ప్రొఫెసర్ సందీప్ డిప్రెషన్లో ఉన్నట్లు సహోద్యోగులు చెప్పారని పోలీసులు తెలిపారు. డాక్టర్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటామని అన్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. తండ్రి, కుమార్తె మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.