ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ(Professor Saibaba)కు ఊరట లభించింది. మావోయిస్టులతో లింకున్న కేసులో ఆయన్ను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో 54 ఏళ్ల సాయిబాబతో పాటు మరో అయిదుగుర్ని 2017లో సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించింన విషయం తెలిసిందే. అయితే ఇవాళ బాంబే హైకోర్టు ఆ కేసులో తీర్పును వెలువరించింది. అంగవైకల్యం ఉన్న సాయిబాబను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో దాఖలైన పిటీషన్ను అక్టోబర్ 14, 2022న సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం ఆదేశించింది. ప్రస్తుతం ప్రొఫెసర్ సాయిబాబ.. నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
సాయిబాబకు మావోలతో లింకు ఉన్నట్లు 2017లో గడ్చిరోలిలోని సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. దేశానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. గడ్చిరొలిలో ఉన్న మావోలకు కావాల్సిన విప్లవ సాహిత్యం సాయిబాబ వద్ద ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. సెషన్స్ కోర్టు పిటీషన్ను .. బాంబే హైకోర్టులో ఆయన ఛాలెంజ్ చేశారు.
నిందితులపై ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారని, దాని వల్ల సాయిబాబను నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ వినయ్ జోషి, వాల్మీకి మెనిజేస్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. యూఏపీఏ కింద నిందితుల్ని బుక్ చేయాలని చేసిన ప్రతిపాదనను కూడా కోర్టు కొట్టిపారేసింది. 50వేల పూచీకత్తుపై నిందితుల్ని రిలీజ్ చేయవచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో సుప్రీంను రాష్ట్ర సర్కార్ ఆశ్రయించనున్నది.