ముంబై/న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు శిక్ష నుంచి బాంబే హైకోర్టు విముక్తి కలిగించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అభియోగాలతో 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అత్యంత కఠినమైన యూఏపీఏ చట్టం కింద సాయిబాబాపై అభియోగాలు మోపటంతో ఆయనకు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. దీనిని హైకోర్టులో సాయిబాబా సవాల్ చేశారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ రోహిత్ దేవ్, జస్టిస్ అనిల్ పన్సారేతో కూడిన నాగపూర్ బెంచ్, జీవిత ఖైదు శిక్షను రద్దుచేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఎన్ఐఏ వెంటనే సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, అత్యున్నత న్యాయస్థానం దానిని తిరస్కరించింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై శనివారం విచారణ జరిపేందుకు అంగీకరించింది.
సాయిబాబాకు జీవితఖైదు విధిస్తూ 2017లో గడ్చిరోలి కోర్టు ఇచ్చిన తీర్పు తప్పుల తడకగా ఉన్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదంపై పోరాటం చేయటం ముఖ్యమే కానీ.. అది వ్యక్తుల హక్కులను కాలరాసేలా ఉండరాదని స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే ఎన్ఐఏ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఎన్ఐఏ తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం.. ముందుగా కోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ను రిజిస్టర్ చేయాలని సూచించింది. పిటిషన్పై విచారణను ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని పేర్కొన్నది. బాంబే హైకోర్టు తీర్పుపై సాయిబాబా సతీమణి వసంత కుమారి సంతోషం వ్యక్తంచేశారు. ఆలస్యంగానైనా తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.