Priyanka Gandhi | న్యూఢిల్లీ : ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ – సమాజ్వాది పార్టీ పొత్తుపై గత కొద్ది రోజుల నుంచి నీలినీడలు కమ్ముకున్న విషయం విదితమే. ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది.
అయితే జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీతో ప్రియాంక పలు దఫాలుగా చర్చించారు. అనంతరం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో చర్చలు జరిపి పొత్తు వ్యవహారంతో పాటు సీట్ల పంపకాన్ని ఆమె కొలిక్కి తీసుకొచ్చారు. 80 లోక్సభ స్థానాలు ఉన్న యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతోంది. అయితే మొర్దాబాద్ ఎంపీ సీటు కావాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. కానీ అందుకు ఎస్పీ అంగీకరించలేదు. మొర్దాబాద్ సీటు కేటాయించని పక్షంలో సీతాపూర్, శ్రవస్తి, వారణాసి స్థానాలు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరడంతో చర్చలు ముందుకు సాగాయి. మొత్తానికి ఎస్పీ అంగీకరించడంతో కాంగ్రెస్తో పొత్తు కుదిరింది.
అమేథి, రాయ్ బరేలి, ప్రయాగ్రాజ్, వారణాసి, మహారాజ్గంజ్, డియోరియా, బాన్స్గావ్, సీతాపూర్, అమ్రోహా, బులంద్షర్, ఘజియాబాద్, కాన్పూర్, ఝాన్సీ, బారాబంకీ, ఫతేపూర్ సిక్రీ, షాహారన్పూర్, మథుర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. త్వరలోనే ఎస్పీ – కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పొత్తులపై ప్రకటన చేయనున్నారు.