న్యూఢిల్లీ: కోవిడ్ సంబంధిత చికిత్సలో వినియోగిస్తున్న వైద్య పరికరాలు, మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా డిమాండ్ చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆమె ట్వీట్ చేశారు. కోవిడ్పై పోరాటంలో ప్రాణాలు కాపాడుతున్న అన్ని రకాల వైద్య సామాగ్రి, మందులపై జీఎస్టీ ఎత్తివేసి భారం తగ్గించాలన్నారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ మందులపై జీఎస్టీ వసూల్ చేయడం క్రూరత్వమే అవుతుందని ఆమె విమర్శించారు. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ సమావేశం కానున్న నేపథ్యంలో ప్రియాంకా ఈ ట్వీట్ చేశారు. శానిటైజర్, సోప్లు, గ్లౌజ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు .. ఇలా అనేక మందులు, సామాగ్రిపై ఉన్న జీఎస్టీని రద్దు చేయాలని ప్రియాంకా కోరారు.