న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ.. వ్యాక్సిన్ల కొరత అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కోవిడ్ టీకాల కొరత ఏర్పడినట్లు ఆమె ఆరోపించారు. ప్రధాని మోదీ పర్సనల్ పబ్లిసిటీ కోసం అన్నట్టుగా వ్యాక్సిన్లు ఇస్తున్నారని, ప్రజలను రక్షించే ఔషధంగా వ్యాక్సిన్లను చూడడం లేదని ఆమె విమర్శించారు. వ్యాక్సిన్ సమస్య ఉత్పన్నం కావడానికి మోదీయే కారణమన్నారు. ట్విట్టర్లో రియాక్ట్ అయిన ప్రియాంకా గాంధీ.. మోదీ సర్కార్ గత ఏడాదే వ్యాక్సినేషన్ ప్లాన్ వేసిందని, కానీ ఈ ఏడాది జనవరిలో కేవలం కోటి 60 లక్షల టీకాలకు మాత్రమే ఎందుకు ఆర్డర్ చేశారని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం తక్కువ సంఖ్యలో టీకాలు కేటాయించిందని, కానీ ఎక్కువ సంఖ్యలో విదేశాలకు టీకాలు అమ్మినట్లు ప్రియాంకా ఆరోపించారు. ప్రపంచంలో అత్యధిక స్థాయిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే దేశం ఇండియానే అని, కానీ మనం ఇప్పుడు ఇతర దేశాలను వ్యాక్సిన్లను అడుక్కోవాల్సి వస్తుందని, ఈ దుస్థితికి ఎవరు బాధ్యులు అని ఆమె అన్నారు.