సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతుల మీద నుంచి దూసుకెళ్లిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీ వద్రా ఆందోళన చేపట్టారు. అయితే ఆమెను సీతాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గెస్ట్ హౌజ్లో ఆమెను బంధించారు. పీఏసీ గెస్ట్ హౌజ్లో ఉన్న ఆమె.. అక్కడ చీపురు అందుకుని ఆ రూమ్ను శుభ్రం చేశారు. ఆ తర్వాత ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. గెస్ట్ హౌజ్ రూమ్ శుభ్రంగా లేదని, అందుకే ఆమె ఆ రూమ్ను క్లీన్ చేసినట్లు కొందరు తెలిపారు. ప్రియాంకా తనను బంధించిన గదిని ఊడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అరెస్టును నిరసిస్తూ ఆందోళనకారులు ఆ గెస్ట్ హౌజ్ ముందు ధర్నా చేపట్టారు. ప్రియాంకా గాంధీ, దీపేందర్ హూడాలపై పోలీసులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్ ఖండించింది. సీతాపూర్లో తన కాన్వాయ్ను అడ్డుకున్న సమయంలో ప్రియాంకా గాంధీ పోలీసులపై తిరగబడ్డారు. తన అరెస్టు వారెంట్ చూపించాలంటూ ఆమె డిమాండ్ చేశారు.