లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతులను పొట్టనపెట్టుకున్న వారు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే తనను మాత్ర అకారణంగా నిర్బంధించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎలాంటి ఉత్తర్వులూ, ఎఫ్ఐఆర్ లేకుండా తనను 28 గంటలుగా సీతాపూర్లోని గెస్ట్హౌస్లో మీ ప్రభుత్వం నిర్బంధించిందని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళనల నేపథ్యంలో చెలరేగిన హింసలో నలుగురు రైతులతో పాటు ఎనిమిది మంది మరణించిన ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆదివారం నాటి ఘర్షణలకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పట్ల ప్రియాంక గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో రైతులను బీజేపీ ఎంతలా ద్వేషిస్తోందని ప్రియాంక గాంధీ అంతకుముందు ట్వీట్ చేశారు. రైతులు గళమెత్తితే మోదీ ప్రభుత్వం వారిని కాల్చిచంపుతుందని, కార్లతో గుద్ది చంపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు దూసుకువెళ్లడంతో నలుగురు రైతులు మరణించారని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఆ కారులో తాను లేనని ఆ తర్వాత ఆశిష్ మాటమార్చాడు. మరోవైపు ప్రియాంక గాంధీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గెస్ట్హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు.